Nara Lokesh: ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారు: నారా లోకేశ్

  • దిశ చట్టం అంటూ మాయ చేశారు
  • ఒక మహిళకు కూడా న్యాయం జరిగింది లేదు
  • కోట అనూష హత్యను ఖండిస్తున్నా
Nara lokesh fires on Jagan

గుంటూరు జిల్లా నరసరావుపేటలో అనూష అనే విద్యార్థినిని ప్రేమ పేరుతో విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారని మండిపడ్డారు.

దిశ చట్టం అంటూ మాయ చేశారని అన్నారు. ఇప్పుడు ఏమైనా జరిగితే గన్ను రావడం లేదు, జగన్ కనపడటం లేదని ఎద్దేవా చేశారు. ఒక మహిళకు కూడా న్యాయం జరిగిందిలేదని చెప్పారు. కళ్ల ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ లో చలనం రావడం లేదని దుయ్యబట్టారు.

'నరసరావుపేటలో ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని కోట అనూషను అత్యంత దారుణంగా హత్య చేశాడు మృగాడు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చ నుండి బయటికి వచ్చి మహిళలకు రక్షణ కల్పించాలి. అనూషని హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. అనూష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News