Supreme Court: వారికి సివిల్స్​ రాసే చాన్స్​ లేనే లేదు: తేల్చి చెప్పిన సుప్రీం

  • గత ఏడాది ప్రిలిమ్స్ కు హాజరు కాని అభ్యర్థుల పిటిషన్ కొట్టివేత
  • వయసు ఉంటే రాసుకోవచ్చని సూచన
  • వయసైపోయిన వారికి గతేడాదితోనే అవకాశాలు అయిపోయాయని స్పష్టీకరణ
No relief for candidates who missed last chance to take UPSC 2020 exams SC

గత ఏడాది సివిల్స్ చివరి ప్రయత్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఊరటనివ్వలేదు. గత ఏడాది మిస్ అయి.. ఈ ఏడాది పరీక్ష రాసే అర్హత వయసు లేని వారికి మరోసారి సివిల్స్ రాసే అవకాశం ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు గత ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ కు దరఖాస్తు చేసుకుని, పరీక్షకు హాజరు కాలేకపోయిన అభ్యర్థుల పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

పరీక్షకు కావాల్సిన అర్హత వయసు అభ్యర్థులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. చివరి అటెంప్ట్ పరీక్షకు హాజరు కాకపోయినా ఆ అవకాశం పోయినట్టేనని, గతేడాదితోటే వారి అవకాశాలన్నీ అయిపోయాయని పేర్కొంది. వయసున్న వారే మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని స్పష్టం చేసింది.

కరోనా నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయామని, కరోనా మహమ్మారితో పలుమార్లు పరీక్షలూ వాయిదా పడ్డాయని, తమలో కొందరికి అదే చివరి అవకాశమని పేర్కొంటూ ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్ లో మరో అవకాశం ఇవ్వాలని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.  

అయితే, వయసు అయిపోకపోయి ఉంటే గత ఏడాది అభ్యర్థులకు ఈ ఏడాది ప్రిలిమ్స్ లో మరో అవకాశం కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కాగా, ఈ ఏడాది ప్రిలిమ్స్ కు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 3 వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చింది. జూన్ 27న పరీక్ష నిర్వహించనున్నారు.

More Telugu News