Maharashtra: ఆర్టీపీసీఆర్​ నెగెటివ్​ రిపోర్ట్​ ఉంటేనే.. ఆ ఐదు రాష్ట్రాల వారికి ఢిల్లీలోకి ప్రవేశం!

  • మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల వారికి రూల్
  • శుక్రవారం నుంచి అమలు చేసే యోచనలో ఢిల్లీ సర్కార్
  • మార్చి 15 వరకు అమలు కానున్న కొత్త నిబంధనలు
Delhi To Ask For Covid Report For Arrivals From 5 States

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రాల నుంచి ఎవరైనా ఢిల్లీ రావాలనుకుంటే.. కచ్చితంగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును చూపిస్తేనే అనుమతించేలా నిబంధన పెడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని ఢిల్లీ సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మార్చి 15 దాకా ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉండనున్నట్టు సమాచారం. దీనిపై ఈరోజు సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి విమానాలు, రైళ్లలో వచ్చే వారికి ఈ నిబంధనను అమలు చేయనున్నారు. వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో 86 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ విమానం ఎక్కేముందు ప్రయాణికులు టెస్టు చేయించుకున్న రిపోర్టును ఆయా రాష్ట్రాల అధికారులే పరిశీలించనున్నారు. కాగా, ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇలాంటి ఆంక్షలే విధించాయి.

More Telugu News