Tapsee: ఆకలి తీర్చే రైతన్నల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది: తాప్సీ ఆవేదన

  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు
  • ప్రాణాలు కోల్పోయిన పలువురు రైతులు
  • హర్యానా మంత్రి దలాల్ తీవ్ర వ్యాఖ్యలు
  • ఇంట్లో ఉంటే చనిపోకుండా ఉంటారా? అని వ్యాఖ్యలు
  • రైతుల ప్రాణాలంటే ఇంత ఎగతాళా? అంటూ తాప్సీ స్పందన
Tapsee responds on Haryana minister Dalal comments on farmers deaths

కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గత కొన్ని నెలలుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కొందరు రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ అంశంపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

 "ఎక్కడ చనిపోతే ఏం? ఇంట్లో ఉంటే మాత్రం చనిపోకుండా ఉంటారా? వాళ్లు ఇష్టపూర్వకంగానే మరణించారు. కొన్ని లక్షల మంది జనాభాలో రెండు వందల మంది చనిపోతే అదేమంత పెద్ద విషయమా?" అంటూ దలాల్ వెటకారంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దలాల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై సినీ నటి తాప్సీ స్పందించారు. మన ఆకలి తీర్చే రైతన్నల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చనిపోతే ఇంత హేళనగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. మనిషి జీవితమే చులకనగా మారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News