India: 'విజిల్ పోడు'...బీసీసీఐ పంచుకున్న విరాట్ కోహ్లీ వీడియో!

  • రెండో టెస్టులో విజయం దిశగా టీమిండియా
  • విజిల్స్ వేసి ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచిన కోహ్లీ
  • అభిమానుల కేరింతలతో దద్దరిల్లిన చెపాక్
BCCI Shared Virat Kohli Vigil Video

తొలి టెస్టులో ఓటమి అనంతరం, ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో విజయం దిశగా భారత జట్టు సాగుతున్న వేళ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను రవిచంద్రన్ అశ్విన్ కుదేలు చేస్తున్న వేళ, అభిమానులను ఉత్సాహపరుస్తూ, మైదానంలో కోహ్లీ కనబడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

చెన్నైలో క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది 'విజిల్ పోడు' (ఈల వెయ్యి). ఐపీఎల్ పుణ్యమాని ఈ పదం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఇక నిన్న మ్యాచ్ ఆడుతున్న సమయంలో కోహ్లీ, మైదానంలో విజిల్ వేస్తూ, అభిమానులు కూడా విజిల్ వేయాలని ఉత్సాహపరిచాడు. ఈ మేరకు సైగలు చేశాడు.

దీంతో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ, గోల చేస్తుంటే, తనకు వినిపించడం లేదని సైగ చేస్తూ, వారిని మరింతగా ఉత్సాహపరిచాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకపోగా, 50 శాతం నిండిన మైదానం కూడా దద్దరిల్లిపోయింది. దీంతో కోహ్లీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపాడు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News