boney kapoor: ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై మ‌రోసారి మండిప‌డ్డ బోనీక‌పూర్!

  • అక్టోబర్ 13న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్.. 15న  'మైదాన్'  విడుద‌ల‌
  • రాజ‌మౌళితో ఫోనులో మాట్లాడాన‌న్న బోనీక‌పూర్
  • అది నిర్మాత‌ల నిర్ణ‌య‌మ‌ని చెప్పార‌ని ఆగ్ర‌హం
  •  రాజమౌళి నుంచి తాను ఇలాంటి చర్య ఊహించలేదని ఆగ్ర‌హం
boney kapoor fires on rajamouli

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ అజయ్ దేవగణ్ హీరోగా నిర్మిస్తున్న 'మైదాన్' చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా అందుకు రెండు రోజుల ముందే 'ఆర్ఆర్ఆర్' సినిమాను విడుద‌ల చేస్తుండ‌డం ప‌ట్ల బోనీక‌పూర్ ఇటీవ‌లే మండిప‌డ్డారు. ఇప్పుడు మ‌రోసారి ఇదే విష‌యంపై బోనీక‌పూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఒకే నెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన సినిమాల‌ను విడుదల చేయడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ లో అజయ్ ‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని, అలాగే, తాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న మైదాన్ లో అజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడ‌ని బోనీ క‌పూర్ చెప్పారు.

ఈ సినిమాను గ‌త ఏడాది విడుదల చేయాలనుకున్నామ‌ని, కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయిందని తెలిపారు. సినిమా కోసం తాము అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టామ‌ని చెప్పుకొచ్చారు. మ‌ళ్లీ సినిమా షూటింగ్  ప్రారంభించిన సమయంలోనే తాము మైదాన్ విడుదల తేదీని ప్ర‌క‌టించామ‌ని తెలిపారు.  

తాము ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజులకే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుద‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ని చెప్పారు. ఇది అనైతికమైన చర్య అంటూ మండిడప‌డ్డారు. తాను ఈ విష‌యంపై ఇటీవల రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడానని, విడుదల తేదీతో తనకు సంబంధం లేదని చెప్పార‌ని వివ‌రించారు.  

అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన అన్నార‌ని, అయితే, ఆయన మాటలను తాను నమ్మాలనుకోవడం లేదని చెప్పారు. ఆ సినిమా విడుదల గురించి అజయ్ దేవ‌గ‌ణ్ కూ ముందుగా చెప్పి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయప‌డ్డారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో  మంచి పేరున్న రాజమౌళి నుంచి తాను ఇలాంటి చర్య ఊహించలేదని వ్యాఖ్యానించారు.

More Telugu News