Hyderabad: ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసు.. వెలుగులోకి నివ్వెరపరిచే వాస్తవాలు

  • హైదరాబాద్ శివారులో మొన్న సాయంత్రం విద్యార్థిని కిడ్నాప్
  • నిందితులకు నేర చరిత్ర
  • ఒంటరిగా వెళ్లే విద్యార్థులు, ఉద్యోగినులపై కన్ను
  • గతంలో నలుగురిపై సామూహిక అత్యాచారం
Four arrested in Pharmacy Student kidnap and gang rape case

హైదరాబాద్ శివారులోని కీసరలో మొన్న సాయంత్రం జరిగిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో నివ్వెరపరిచే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు విషయం తెలియకుండా హత్య చేయాలని భావించారు. అయితే అప్పటికే పోలీసులు వస్తున్న విషయం తెలిసి ఆమెను వదిలి పరారయ్యారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఓ ముఠా అని, గతంలో మరికొందరిపైనా అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో వెలుగుచూసింది.

కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కాలేజీ బస్సు దిగే బాధిత యువతి (19), అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి ఆటోలో వెళ్లేది. ఈ క్రమంలో నిందితుడి ఆటోను పలుమార్లు ఎక్కింది. దీంతో అతడి కన్ను ఆమెపై పడింది. విషయాన్ని తన స్నేహితులైన మిగతా ముగ్గురికి కూడా చెప్పి కిడ్నాప్‌కు పథకం వేశాడు.

బుధవారం సాయంత్రం కూడా మామూలుగానే యువతి అతడి ఆటో ఎక్కడంతో కిడ్నాప్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించాడు. స్నేహితులకు ఫోన్ చేసి ‘మ్యాటర్ రెడీగా ఉంది’ అని సమాచారం ఇచ్చాడు. బాధితురాలు ఆటో ఎక్కిన తర్వాత అప్పటికే ఉన్న ఇద్దరు మహిళలు, ఓ యువకుడు కొంతదూరం తర్వాత దిగిపోయారు.

ఆ తర్వాతి స్టాపులోనే యువతి దిగాల్సి ఉండగా నిందితుడు ఆటోను ఆపకుండా యంనంపేట వైపు వేగంగా పోనిచ్చాడు. దీంతో భయపడిన యువతి తల్లికి ఫోన్ చేసి ఆటో ఆపకుండా ఎటో తీసుకెళ్తున్నాడని, తనకు భయంగా ఉందని చెప్పింది. దీంతో ఆమె బంధువుల సాయంతో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

మరోవైపు, యంనంపేట వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కి ఆమెకు చెరోపక్క కూర్చున్నారు. మరో వ్యక్తి ఘట్‌కేసర్ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆటో అక్కడికి చేరుకోగానే బాధిత యువతిని అందులోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. అయితే, అప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేశారని, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మైక్‌లో చేస్తున్న అనౌన్స్‌మెంట్ నిందితులకు వినిపించింది. దీంతో దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారని భావించిన నిందితులు యువతిని వ్యాన్ నుంచి కిందికి దించి పక్కనే ఉన్న పొదల్లో పడేసి పరారయ్యారు.

సెల్ సిగ్నల్ ఆధారంగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిన్న ఉదయం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, విచారణలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరికీ నేరచరిత్ర ఉందని,  కాలేజీ, ఉద్యోగాలకు ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు తెలిపారు. ఓ 15 రోజులపాటు వారిని గమనించిన తర్వాత ప్రణాళిక అమలు చేస్తారని వివరించారు. కిడ్నాప్ చేసిన అనంతరం తమకు సహకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. గతంలో మరో నలుగురు మహిళలపైనా అత్యాచారానికి తెగబడినట్టు నిందితులు అంగీకరించారు.

More Telugu News