Dog: ఉత్తరాఖండ్ లో ప్రమాదం జరిగిన చోట తన యజమాని కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్న శునకం!

  • ఉత్తరాఖండ్ లో భారీ విపత్తు
  • కొండచరియలు విరిగిపడి ఆకస్మిక వరదలు
  • ఓ సొరంగం నుంచి కార్మికులను రక్షించిన సహాయక బృందాలు
  • వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం
  • రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్న బ్లాకీ అనే శునకం
Dog still awaits for his master at tunnel in Uttarakhand

కొన్నిరోజుల కిందట ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా నదికి ఆకస్మిక వరదలు సంభవించడం తెలిసిందే. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు 34 మృతదేహాలు వెలికితీసినట్టు అధికారులుపేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో తపోవన్ హైడ్రల్ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతింది. గల్లంతైన వారిలో అత్యధికులు ఈ ప్రాజెక్టుకు చెందిన కార్మికులేనని గుర్తించారు. అయితే, ఓ సొరంగంలో పనులు చేస్తున్న కార్మికులు కూడా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. సహాయక బృందాలు ఆ సొరంగం నుంచి పలువురు కార్మికులను రక్షించాయి. అయితే వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో, గత మూడు రోజులుగా ఆ సొరంగం వద్ద బ్లాకీ అనే శునకం తన యజమాని కోసం ఎదురుచూస్తున్న వైనం అందరినీ కదిలించింది. ఈ విపత్తు నుంచి త్రుటిలో తప్పించుకున్న రాజిందర్ కుమార్ మాట్లాడుతూ, తాము పనిచేస్తున్నంత సేపు ఆ శునకం ఎప్పుడూ అక్కడే ఉంటుందని, తాము వేసే ఆహారం తిని పడుకుంటుందని, తిరిగి సాయంత్రం తాము వెళ్లిపోయే సమయంలో అది కూడా వెళ్లిపోతుందని వివరించాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి అది రాత్రివేళల్లో కూడా ఆ సొరంగం వద్దే ఉంటోందని వెల్లడించాడు.

ఆ ప్రాజెక్టు పరిసరాల్లోనే పుట్టి పెరిగిన బ్లాకీని అక్కడి కార్మికుల్లో ఒకరు పెంచుకుంటున్నట్టు తెలిసింది. సహాయక బృందాలు వెలికితీసిన వాళ్లలో తన యజమాని లేకపోవడంతో ఆ శునకం ఇంకా అక్కడే ఉంటోంది. సహాయక చర్యల కోసం భారీ యంత్రాలను తీసుకురావడంతో సొరంగం నుంచి ఇవతలికి వచ్చిన ఆ శునకం... ప్రాజెక్టును మాత్రం వీడిపోలేదు. ఇతర కార్మికులు పెట్టే ఆహారం తింటూ తన యజమాని కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

More Telugu News