GHMC: సీఎం కేసీఆర్​, కేటీఆర్​ లకు కృతజ్ఞతలు: జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి

  • నగరాభివృద్ధికి అందరి సలహాలూ తీసుకుంటానని వెల్లడి
  • మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామని వ్యాఖ్య
  • మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలకు ఇవ్వడం పట్ల హర్షం
GHMC New mayor Vijayalaxmi Thanked CM KCR and KTR

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి కొత్త మేయర్ గా ఎన్నికైన కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను మహిళలకు ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అందుకు ఆమె, కేసీఆర్, కేటీఆర్ లకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు.

హైదరాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పాటుపడతానన్నారు. నగరాభివృద్ధికి అందరి సలహాలూ తీసుకుంటానని చెప్పారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. అవినీతిపై ఎంతదాకా అయినా వెళ్లి పోరాడుతానని స్పష్టం చేశారు.

కాగా, గురువారం మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులనూ టీఆర్ఎస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని చెబుతూ వస్తున్న మజ్లిస్ పార్టీ కూడా.. టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతును ప్రకటించింది. తన పార్టీ సభ్యులను బరిలోకి దించలేదు. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు అవసరం లేకుండానే టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సాధించింది.

More Telugu News