YS Sharmila: తన కుర్చీని కాపాడుకోవడానికి షర్మిలతో కేసీఆర్ పార్టీ పెట్టిస్తున్నారు: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

  • కేసీఆర్ ను కాపాడేందుకు కేవీపీ రంగంలోకి దిగారు
  • కేటీఆర్ సీఎం అంటూ భజనపరులు ఒత్తిడి పెంచుతున్నారు
  • అందుకే కేసీఆర్ కొత్త సమీకరణలకు తెరలేపారు
KCR is behind YS Sharmila says NVSS Prabhakar

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టనుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు. తన కుమారుడు కేటీఆర్ నుంచి తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి... కేసీఆర్ కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పారు. ఇందులో ఒక భాగమే షర్మిల రాజకీయ పార్టీ అని అన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్, కేసీఆర్ హవా తగ్గిందని... దీంతో కేసీఆర్ ను కాపాడేందుకు కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగారని ప్రభాకర్ చెప్పారు. ఆయనే షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో, కేవీపీ ఆలోచనలతోనే షర్మిల ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో కేటీఆర్ సీఎం అంటూ ఆయన భజనపరులు ఒత్తిడి పెంచుతున్నారని... అందుకే కేసీఆర్ కొత్త సమీకరణలకు తెరలేపారని అన్నారు.

కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్టేనని చెప్పారు. కారుకు మబ్బులు కమ్ముకున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ లో ముసలం పుట్టిందని... ఈ సమస్యను అధిగమించేందుకు కమ్యూనిస్టులను కేసీఆర్ కలుపుకుంటున్నారని, కాంగ్రెస్ కు లోపాయకారిగా మద్దతు ఇస్తున్నారని అన్నారు. మధ్యంతర ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.

More Telugu News