Rajiv Kapoor: 'రామ్ తేరీ గంగా మైలీ' కథానాయకుడు రాజీవ్ కపూర్ కన్నుమూత

  • కపూర్ ల కుటుంబంలో విషాదం
  • తీవ్ర గుండెపోటుకు గురైన రాజీవ్ కపూర్
  • ఆసుపత్రికి వెళ్లేలోపే మృతి
  • సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు
Actor Rajiv Kapoor dies of massive cardiac arrest

బాలీవుడ్ సీనియర్ హీరో రాజీవ్ కపూర్ కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. తీవ్రమైన గుండెపోటుకు గురైన రాజీవ్ కపూర్ తుదిశ్వాస విడిచారు. రాజీవ్ కపూర్ ను ఆయన సోదరుడు రణధీర్ కపూర్ ముంబయిలోని ఇన్లాక్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

బాలీవుడ్ లో కపూర్ ల వంశం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ గ్రేట్ షోమ్యాన్ రాజ్ కపూర్ తనయుడే రాజీవ్. రణధీర్ కపూర్, రిషీ కపూర్ లకు తమ్ముడు. బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ చిత్రాల్లో ఒకటిగా పేర్కొనే 'రామ్ తేరీ గంగా మైలీ' చిత్రంలో హీరో రాజీవ్ కపూరే. ఈ చిత్రాన్ని రాజ్ కపూర్ దర్శకత్వంలో కపూర్ ల కుటుంబమే తెరకెక్కించింది. ఇందులో హీరోయిన్ గా నటించిన మందాకిని కూడా ఆ తర్వాత కాలంలో అగ్రశ్రేణి హీరోయిన్ గా వెలుగొందింది. రాజీవ్ కపూర్ 'ఏక్ జాన్ హై హమ్' అనే చిత్రంలోనూ నటించారు. రిషీ కపూర్ హీరోగా వచ్చిన 'ప్రేమ్ గ్రంథ్' చిత్రానికి దర్శకత్వం కూడా చేపట్టారు.  

కాగా, రాజీవ్ కపూర్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

More Telugu News