YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే నా లక్ష్యం: షర్మిల

  • తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందన్న షర్మిల
  • రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్తానని  వ్యాఖ్య
  • 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం
My ambition is to take back Rajanna Rajyam in Telangana says YS Sharmila

హైదరాబాదులోని లోటస్ పాండ్ లో సందడి నెలకొంది. కొత్త పార్టీని ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల తమ అభిమానుల ముందుకు వచ్చారు. చిరునవ్వుతో అందరికీ ఆమె అభివాదం చేశారు. తన తండ్రి స్టయిల్లో చేతులు ఊపుతూ హుషారెత్తించారు. ఈ సందర్భంగా ఆమెకు పలు ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయగా... ఆమె పొడిపొడిగానే సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.

అందరూ కాస్త ఓపిక పట్టాలని... అన్ని విషయాలు చెపుతానని ఆమె అన్నారు. అందరితో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తర్వాత చెపుతానంటూ ముందుకు సాగారు. గ్రౌండ్ రియాల్టీ ఏమిటనే విషయం తెలుసుకోవడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు  చేశామని చెప్పారు. తెలంగాణలో రాజన్న లేని లోటు క్లియర్ గా కనిపిస్తోందని... ఆయన రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. ఈ రోజు నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశాన్ని నిర్వహించనున్నారు. వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు.

మరోవైపు కొత్త పార్టీపై కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగసభను నిర్వహించే అవకాశం ఉంది. వైయస్సార్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News