Uttarakhand: ఉత్తరాఖండ్ జలప్రళయంపై నటుడు మహేశ్‌బాబు విచారం

  • వారి గురించే ఆలోచిస్తున్నట్టు పేర్కొన్న మహేశ్
  • సహాయక చర్యలు చేపడుతున్న ఐటీబీపీ పోలీసులకు సెల్యూట్
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
Tollywood Actor Mahesh Babu Saddened about Uttarakhand Glacier Incident

ఉత్తరాఖండ్ జలప్రళయంపై టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్‌బాబు స్పందించాడు. గల్లంతైన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషిమఠ్‌లో నిన్న మంచు చరియలు విరిగిపడడంతో గంగానదికి ఉపనది అయిన ధౌలీగంగా నదికి వరద పోటెత్తింది. ఆ నదిపై నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సమీప ప్రజలు దాదాపు 100 మందికిపైగా గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న 16 మందిని రక్షించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు పదిమంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై ట్వీట్ చేసిన మహేశ్‌బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. వారందరూ క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించిన మహేశ్.. వారి గురించే ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన జవాన్లకు సెల్యూట్ చేశాడు.

More Telugu News