Challa Dharma Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు

  • అయోధ్య రామమందిరంపై వ్యాఖ్యలు చేశాడంటూ ఆరోపణ
  • నక్కలగుట్టలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
  • పలువురు బీజేపీ నేతల అరెస్ట్
  • మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు
BJP cadre attacks on MLA Challa Dharma Reddy house

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ కార్యకర్తలు, నేతలు దాడికి దిగారు. అయోధ్య రామమందిరం అంశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడంటూ చల్లా ధర్మారెడ్డి నివాసంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దాంతో హన్మకొండ నక్కలగుట్టలోని ధర్మారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ దాడిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అయినట్టు గుర్తించారు. ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న హన్మకొండ పోలీసులు ఏసీపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై దాడి జరిగిందన్న సమాచారంతో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పరకాల పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ఎమ్మెల్యే నివాసంపై దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

More Telugu News