New Delhi: ఢిల్లీలో నిర‌స‌న తర్వాత 100 మంది రైతులు అదృశ్యమయ్యారు: ప‌ంజాబ్ మాన‌వ హ‌క్కుల సంస్థ‌

  • పంజాబ్‌ సమీపంలోని ఓ గ్రామంలోనూ కొంద‌రు రైతులు మాయం
  • 12 మంది రైతులు క‌న‌ప‌డ‌ట్లేద‌ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు
  • అదృశ్య‌మైన వారిలో ఎర్రకోటపై జెండా ఎగరేసిన వారే అధికం

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త‌ వ్యవసాయ చట్టాలను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గణతంత్ర దినోత్సవం రోజున రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు చోట్ల హింస చోటు చేసుకుంది. అందులో పాల్గొన్న 100 మంది రైతులు ఆ  ఘటన తర్వాత ఇప్ప‌టివ‌ర‌కు  కనిపించడం లేదని పంజాబ్‌ హ్యూమన్ రైట్స్‌ సంస్థ ప్ర‌క‌టించింది.

అంతేకాదు, పంజాబ్‌ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 12 మంది రైతులు క‌న‌ప‌డ‌ట్లేద‌ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా రైతులు ఎర్రకోటపై జెండా ఎగరేసిన విష‌యం తెలిసిందే.

అదృశ్య‌మైన వారిలో ఎర్ర‌కోట వ‌ద్ద నిరస‌నలో పాల్గొన్న వారే అత్య‌ధిక మంది ఉన్నార‌ని పంజాబ్ లోని ఆ హ‌క్కుల సంస్థ తెలపింది. ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారిలో సుమారు 200 మంది రైతులపై ఢిల్లీ ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కొంత‌మందిపై దేశద్రోహం కేసులు కూడా నమోదయ్యాయి.

More Telugu News