Farm Laws: ఢిల్లీ సరిహద్దుల్లో రెండు రోజులపాటు ఇంటర్నెట్​ సేవలపై నిషేధం

  • కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు
  • ఘాజీపూర్ లో ఫోన్ సేవలూ తాత్కాలికంగా నిలిపివేత
  • సద్భావన దినం నిర్వహిస్తున్న  రైతు సంఘాల నేతలు
  • రోజంతా నిరశన దీక్షలు.. తరలివస్తున్న రైతులు
Internet suspended at Ghazipur border as thousands from UP march towards protest site to join farmers protest

రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద ఆదివారం రాత్రి 11 గంటల వరకు నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సరిహద్దులతో పాటు వాటికి ఆనుకుని ఉండే ఎన్సీటీ పరిసర ప్రాంతాల్లోనూ నిషేధం అమల్లో ఉంటుందని అందులో పేర్కొంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఫోన్ సర్వీసులనూ తాత్కాలికంగా నిలిపేసింది.

ఇప్పటికే హర్యానా ప్రభుత్వం 17 జిల్లాల్లో జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. కాగా, రైతు సంఘం నేతలు జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సద్భావన దినాన్ని  నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రోజంతా నిరశన దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే రెండు రైతు సంఘాలు ఉద్యమం నుంచి నిష్క్రమించగా.. పంజాబ్, హర్యానాల నుంచి వేలాది మంది రైతులు మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. దీంతో ఘజియాబాద్, ఘాజీపూర్ లవైపు వెళ్లే రహదారులన్నింటినీ పోలీసులు మూసేశారు.

కాగా, గణతంత్ర దినోత్సవాన నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాత 100 మంది పంజాబ్ రైతులు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది.  వారు కాకుండా 18 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.

More Telugu News