Vijayasai Reddy: ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు: నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి

  • చంద్రబాబుకు తొత్తు అంటూ ఎస్ఈసీపై వ్యాఖ్యలు
  • లాలూచీ పడ్డారని మండిపాటు
  • టీడీపీ మేనిఫెస్టోపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ ఆగ్రహం
  • నిమ్మగడ్డను చంద్రబాబు చంద్రముఖిలా ఆవహించాడన్న విజయసాయి
Vijaysai Reddy reiterated Nimmagadda undeserved for SEC post

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడని అన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ, కుల రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎస్ఈసీగా ఎంతో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఒకరికి కొమ్ము కాస్తున్నాడని విమర్శించారు.

ఓ దశలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిలిపివేశారని, ఆ సమయంలో కరోనా వ్యాప్తిని కారణంగా చెప్పారని, ఇప్పుడేమీ కరోనా పూర్తిగా తొలగిపోలేదని, మరి నిమ్మగడ్డ ఎందుకంత తొందరపడుతున్నారని విజయసాయి మండిపడ్డారు. తన పదవీ విరమణ చేసేలోపు ఎన్నికలు జరిపాలని ఎందుకు ఆరాటపడుతున్నాడని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి చంద్రబాబుతో లాలూచీ పడి ఇలాంటి పనులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు.

పార్టీ రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో చెప్పాలని నిలదీశారు. ప్రతి ఒక్క అధికారిపైనా, ప్రభుత్వంపైనా, ఎంపీలపైనా చర్యలు తీసుకునేందుకు తహతహలాడే నిమ్మగడ్డ... చంద్రబాబును ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు.

రాజ్యాంగ విరుద్ధంగా మేనిఫెస్టో రిలీజ్ చేసినందుకు టీడీపీ గుర్తింపు రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డదని, చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించాడని విజయసాయి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ఓ రాజకీయనేతలా వ్యవహరిస్తుండడం చూస్తుంటే అలాగే అనిపిస్తోందని అన్నారు.

నిమ్మగడ్డ మానసికంగా గాడితప్పిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎస్ఈసీ పదవిలో కూర్చోబెట్టడం ఏంటని అన్నారు. ఎస్ఈసీ పదవిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తినే నియమించాలని, నిమ్మగడ్డ మానసిక ఆరోగ్యంపై మెడికల్ బోర్డుకు సిఫారసు చేయాలని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశాల్లో నిమ్మగడ్డ మాటలు వింటుంటే ప్రవచనాలు చెప్పడంలో చాగంటి, గరికపాటి వారిని కూడా మించిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. న్యాయం రెండు కాళ్లపై నడవాలని చెబుతూ పోజులు కొడుతున్నాడని అన్నారు.

కిందటి పర్యాయం 2013లో స్థానిక ఎన్నికలు జరిగాయని, మళ్లీ 2018లో ఎన్నికలు జరగాల్సి ఉంటే ఎందుకు నిర్వహించలేదని నిమ్మగడ్డను ప్రశ్నించారు. అప్పటినుంచి మీరు నిద్రపోతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని విధి నిర్వహణ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మీరు ఎస్ఈసీ ఉద్యోగానికే పనికిరారు, పనిచేసేవాళ్లనైనా పనిచేయనివ్వండి అని హితవు పలికారు.

కాగా, విజయసాయిరెడ్డి తన మీడియా సమావేశంలో పలుమార్లు నిమ్మగడ్డ అసలు పేరును పలకలేక తడబడ్డారు. పదేపదే నిమ్మగడ్డ భానుమూర్తి అని సంబోధించారు. దాంతో ఆయన పక్కన ఉన్నవాళ్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అని చెప్పడం కనిపించింది.

More Telugu News