Britain: ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే వాయు మార్గాన్ని మూసేసిన బ్రిటన్!

  • యూఏఈ - బ్రిటన్ మధ్య రాకపోకల నిలిపివేత
  • కొత్త స్ట్రెయిన్ కేసులే కారణమన్న యూకే
  • బ్రిటన్, ఐరిష్ పౌరులకు మాత్రం సడలింపులు
  • 10 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ తప్పనిసరి నిబంధన
Britain Closes World Busiest Air Route

ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే వాయు మార్గమైన దుబాయ్ - లండన్ రూట్ ను బ్రిటన్ మూసివేసింది. దుబాయ్, అరబ్ ఎమిరేట్స్ నుంచి విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని బ్రిటన్ ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వైరస్ వెలుగులోకి రావడం, ఇది వ్యాక్సిన్ కు లొంగదని తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, యూఏయీ, బురండి, రువాండాల నుంచి తమ దేశానికి విమానాలను అనుమతించబోమని యూకే రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

"తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ దేశాల నుంచి ఎవరినీ బ్రిటన్ లో కాలుమోపనివ్వబోము. ప్రయాణికులు బ్రిటీష్ జాతీయులై ఉంటే మాత్రం సడలింపులు ఉంటాయి. వారితో పాటు ఐరిష్ లేదా బ్రిటన్ లో నివాసం ఉంటున్న ఇతర దేశాల వారికి కూడా ఇవే సడలింపులు వర్తిస్తాయి. వారంతా పది రోజుల స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే" అని ఆయన అన్నారు.

ఇక ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థలు బ్రిటన్ కు వెళ్లే అన్ని విమానాలనూ రద్దు చేస్తున్నట్టు తమ అధికారిక వెబ్ సైట్లలో ప్రకటించాయి. తమ విమానాల్లో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి రావద్దని, ఏమైనా అనుమానాలుంటే ఎయిర్ లైన్స్ సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ప్రస్తుతం యూఏఈలో చిక్కుబడిపోయిన బ్రిటన్ జాతీయులకు సలహా, సూచనలను విడుదల చేసిన యూకే రవాణా విభాగం, వారు తిరిగి స్వదేశానికి వెళ్లాలని భావిస్తే, ప్రత్యక్ష మార్గాల్లో కాకుండా, పరోక్ష మార్గాల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంబసీని కోరింది.

More Telugu News