Ambati Rambabu: పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధం... చంద్రబాబుపై చర్యలు తీసుకోండి: అంబటి డిమాండ్

  • చంద్రబాబుకు పిచ్చి ముదిరిందన్న అంబటి
  • పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటని వ్యాఖ్యలు
  • నిమ్మగడ్డ ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ 
  • టీడీపీని బతికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
  • తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక 
Ambati demand action against Chnadrababu

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మేనిఫెస్టో విడుదల చేయడాన్ని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుబట్టారు. స్థానిక ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని, లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని నిలదీశారు.

టీడీపీ పనైపోయిందని, దాన్ని బతికించేందుకు ఎస్ఈసీ తన వంతు సహకారం అందిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, నిమ్మగడ్డ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో లేని అధికారాలు చెలాయించేందుకు ప్రయత్నిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

చంద్రబాబు స్ఫూర్తితోనే నిమ్మగడ్డ పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. పదేపదే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, కాలుదువ్వడం, చర్యలు తీసుకుంటుండడం ఎస్ఈసీకి తగదని అంబటి హితవు పలికారు. భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు రాజ్యాంగ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తికి భావ్యం కాదని స్పష్టం చేశారు.

More Telugu News