West Godavari District: పెళ్లికి నో చెప్పిన ప్రియుడు.. కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

  • రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట
  • పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియుడు
  • వెంట తెచ్చుకున్న కత్తితో దాడిచేసి చంపేసిన యువతి
Young woman killed his lover for not marry

రెండేళ్లపాటు ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడాన్ని తట్టుకోలేకపోయిన ప్రియురాలు అతడిని కత్తితో పొడిచి చంపింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలంలోని మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి తాతాజీనాయుడు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లి చేసుకుందామంటూ పావని ఏడాదిగా అడుగుతున్నా తాతాజీ నిరాకరిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం తాతాజీ బైక్‌పై పంగిడి వచ్చాడు. అక్కడ పావని అతడిని కలిసింది. రాత్రి వరకు ఇద్దరూ అక్కడే తిరిగిన అనంతరం బైక్‌పై మలకపల్లి బయలుదేరారు.

 ఈ క్రమంలో వెనక కూర్చున్న పావని సంచిలో వెంట తెచ్చుకున్న కత్తి తీసి తాతాజీని వెనక నుంచి పొడిచింది. బాధతో కిందపడి విలవిల్లాడుతున్న తాతాజీ మెడ, తల, వీపుపైనా కత్తితో  దాడిచేసింది. తీవ్ర గాయాలపాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News