Army: బ్యారక్ గోడ కూలి ఇద్దరు సైనికుల మ‌ృతి

  • మరో జవానుకు తీవ్రగాయాలు
  • జమ్మూలోని మచ్చేడిలో ఘటన
  • బ్యారక్ లో డ్యూటీ చేస్తుండగా కూలిన గోడ
Two Army jawans killed as barrack wall collapses in Jammu

జమ్మూలో బ్యారక్ గోడ కూలి ఇద్దరు జవాన్లు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కథువాలోని మచ్చేడిలో జరిగింది. గాయపడిన మరో జవాను పరిస్థితి విషమంగా ఉందని బిలావర్ పోలీసులు తెలిపారు. బ్యారక్ లో జవాన్లు డ్యూటీ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి దాని గోడ కూలిపోయిందని, ఘటనలో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయని వివరించారు.

వెంటనే వాళ్లను బిలావర్ లోని ఎస్ డీహెచ్ ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరు అప్పటికే మృతిచెందారంటూ డాక్టర్లు చెప్పారన్నారు. చనిపోయిన వాళ్లను హర్యానాలోని సోనిపట్ కు చెందిన సుబేదార్ ఎస్ ఎన్ సింగ్ (45), సాంబాకు చెందిన నాయక్ పర్వేజ్ కుమార్ (39)గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన హర్యానాలోని పానిపట్ కు చెందిన సిపాయ్ మంగళ్ సింగ్ (46)ను మెరుగైన వైద్యం కోసం పఠాన్ కోట్ లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News