Farm Laws: ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు

  • ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • నేడు 11 మందితో రిలే నిరాహార దీక్ష ప్రారంభం
  • ప్రధాని ‘మన్ కీ బాత్’ ప్రసంగ సమయంలో పళ్లాలతో చప్పుడు చేయాలని పిలుపు
farmers started relay hunger stike from today

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. మూడు వారాలకుపైగా వీరి ఆందోళన కొనసాగుతోంది. ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా నిన్న ‘శ్రద్ధాంజలి దివస్’ను పాటించిన రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు దిగుతున్నారు. అన్ని నిరసన కేంద్రాల వద్ద దీక్షలు ప్రారంభమవుతాయని రైతు నేతలు తెలిపారు. నేడు 11 మంది రైతులు సింఘు సరిహద్దు వద్ద దీక్ష ప్రారంభిస్తారని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు.

హరియాణాలోని రహదారులపై ఈ నెల 25 నుంచి 27 వరకు టోల్‌ఫీజులను చెల్లించకుండా అడ్డుకుంటామని కిసాన్ యూనియన్ నేత జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు.  అలాగే, ఈ నెల 27న ప్రధాని ‘మన్‌ కీ బాత్’ ప్రసంగ సమయంలో పళ్లాలతో చప్పుడు చేస్తూ నిరసన తెలపాలని ప్రజలను కోరారు.

కాగా, రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అసంపూర్తిగానే మిగిలాయి. దీంతో మరో ఒకటి, రెండు రోజుల్లో చర్చలు ప్రారంభించనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. మరోవైపు, రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ నిన్న రైతు సంఘాలకు లేఖ రాశారు. ఏ రోజున వీలవుతుందో చెప్పాలని అందులో కోరారు.

More Telugu News