AP High Court: ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ... ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేమన్న హైకోర్టు

  • ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధం
  • ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • ఎన్నికల నిలిపివేతకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టే సాధ్యం కాదన్న న్యాయస్థానం
  • కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎస్ఈసీకి ఆదేశాలు
AP High Court denies interim stay on local body polls

ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కరోనా విధుల్లో నిమగ్నమై ఉందని, ఎన్నికలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పింది. అటు, అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఎస్ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

More Telugu News