KTR: తెలంగాణ వ్యాప్తంగా రహదారులపై రాస్తారోకోలు, ధర్నాలు చేసి రైతులకు సంఘీభావం తెలుపుతాం: కేటీఆర్

  • వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ప్రదర్శనలు
  • డిసెంబరు 8న భారత్ బంద్ కు పిలుపు
  • రైతులకు మద్దతు తెలుపుతూ కేటీఆర్ ప్రకటన
  • టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో పాల్గొనాలని పిలుపు
KTR declares their support to farmers

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్తగా గెలిచిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిసెంబరు 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు తాము మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్నిస్థాయిల్లో టీఆర్ఎస్ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి అందరూ బంద్ లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడా ఒక్క సంస్థ కూడా తెరుచుకోకుండా చూడాలని, జాతీయ రహదారులపై ఎక్కడిక్కడ మోహరించి రాస్తారోకోలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కేంద్ర తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కితీసుకోవాలంటూ పోరాడుతున్న రైతులకు బాసటగా నిలవాలని సూచించారు.

దేశానికి అన్నంపెట్టే రైతన్న కోసం వ్యాపార సముదాయాలను రెండు గంటల ఆలస్యంగా తెరవాలని, ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం తర్వాతే తిప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దయచేసి అందరూ సహకరించాలని కోరారు.

More Telugu News