Arvind: దేవుడికి టీఆర్ఎస్ కండువా కప్పడంతోనే వాళ్ల ఓటమి ఖరారైంది: ఎంపీ అరవింద్

  • వినాయక విగ్రహం మెళ్లో గులాబీ కండువా వేసిన ఎమ్మెల్సీ కవిత
  • ఇంత అహంకారమా అంటూ అరవింద్ ఆగ్రహం
  • టీఆర్ఎస్ ఇచ్చే డబ్బు తీసుకుని బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి
MP Aravind fires on Kalvakuntla Kavitha and other TRS leaders

జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి బాగా రాజుకుంది. షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, జాబితాల విడుదలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కాగా, గాంధీనగర్ లో లక్ష్మీగణపతి ఆలయాన్ని సందర్శించుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడి వినాయక విగ్రహం మెడలో గులాబీ కండువా కప్పారు. దీనిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.

దేవుడికి పార్టీ జెండా కప్పడమేంటని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఆలయంలో దేవుడికి టీఆర్ఎస్ కండువా కప్పడంతోనే వాళ్ల ఓటమి ఖాయమైందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. బీజేపీ మతకల్లోలాలు రాజేస్తోందని కేటీఆర్ అనడంపై అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేది అయ్యాకొడుకులేనని ఆరోపించారు. ఓ మతానికి అమ్ముడుపోయింది కేటీఆర్ అని, అలాంటి వ్యక్తి బీజేపీపై ఆరోపణలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News