Kaushal Manda: బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారికి అవకాశాలు ఎందుకు రావడంలేదో చెప్పిన కౌశల్

  • బిగ్ బాస్-2లో విజేతగా నిలిచిన కౌశల్
  • కంటెస్టెంట్ల గురించి ప్రజలకు అన్నీ తెలుస్తాయని వెల్లడి
  • ఇక కొత్తగా చూపించేందుకు ఏమీ ఉండదని వివరణ
  • అందుకే దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపరని స్పష్టీకరణ
Kaushal Manda reveals why Bigg Boss participants does not get much chances

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి. ప్రేక్షకులకు విశేషమైన రీతిలో వినోదం అందిస్తున్న ఈ కార్యక్రమం టీఆర్పీ రేటింగ్స్ పరంగా రికార్డులు నమోదు చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ నాలుగో సీజన్ నడుస్తోంది. అయితే, బిగ్ బాస్-2లో విజేతగా నిలిచిన కౌశల్ మందా కంటెస్టెంట్లకు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడించారు.

ఆయన ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ, బిగ్ బాస్ షోలో పాల్గొన్నవారికి సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో తగినన్ని అవకాశాలు ఎందుకు రావడంలేదో వివరించారు. ఒక్కసారి బిగ్ బాస్ షోలో పాల్గొంటే వాళ్లకు సంబంధించిన అన్ని విషయాలు జనాలకు తెలిసిపోతాయని, వారిలోని అనేక కోణాలు ప్రజలు గమనిస్తారని తెలిపారు.

కంటెస్టెంట్లు ఏం ధరిస్తారు? ఏం తింటారు? ఏ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారు? అనే విషయాలన్నీ ప్రజలు చూస్తారని అన్నారు. ఇక అలాంటి వాళ్లను సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో  కొత్తగా చూపించేందుకు ఏముంటుందని దర్శకులు, నిర్మాతలు భావిస్తారని కౌశల్ వెల్లడించారు.

బిగ్ బాస్ షో ద్వారా కంటెస్టెంట్ల గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా తెలుసుకుంటారని వెల్లడించారు. అలాంటి కంటెస్టెంట్లను ఓ సినిమాలో గానీ, టీవీ కార్యక్రమంలో గానీ తీసుకుంటే, వారిని ఆ పాత్రలో చూడడం జనాలకు చాలా కష్టమైపోతుందని, వారు బిగ్ బాస్ లో చూసిన కంటెస్టెంట్ నే పరిగణనలోకి తీసుకుంటారని కౌశల్ వివరించారు. పైగా కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు కొత్తగా చేయడానికి ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు.

More Telugu News