Vijayasai Reddy: విశాఖ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన విజయసాయిరెడ్డి

  • నేతల మధ్య విభేదాలున్నట్టు మీడియాలో కథనాలు
  • విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో విజయసాయి భేటీ
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
Vijayasai Reddy conducts emergency meeting with Vizag YSRCP leaders

విశాఖ జిల్లా వైసీపీ నేతల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారనీ, నేతలను పిలిపించుకుని మాట్లాడారనీ, బహిరంగ విమర్శలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విజయసాయిరెడ్డి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో దాదాపు గంటకు పైగా సమావేశం జరగింది. ఈ భేటీలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలపై ముఖ్యంగా చర్చించారు. దీంతోపాటు, ఇతర పార్టీల నుంచి చేరికలపై చర్చలు జరిపారు.

ఈ సమావేశానంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. కొందరు పనికట్టుకుని రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో సంక్షేమ పథకాలపైనే చర్చించామని చెప్పారు. జిల్లాలోని నేతలందరం సమన్వయంతో పని చేస్తున్నామని అన్నారు. పేదలందరూ బాగుండాలనే ముఖ్యమంత్రి జగన్ ఆశయ సాధన కోసం అందరం కలసి పని చేస్తామని చెప్పారు. మరోవైపు మీడియాలో వచ్చిన వార్తలు, తాజా సమావేశానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఈ రోజు మీడియా ముఖంగా మాట్లాడనున్నారని సమాచారం.

More Telugu News