Narendra Modi: ఇటీవల సైలెంట్ ఓటర్ల గురించి ఎక్కువగా వింటున్నాం: ప్రధాని మోదీ

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీ హవా
  • ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ సభ
  • మహిళలే బీజేపీకి అతిపెద్ద సైలెంట్ ఓటర్లన్న మోదీ
PM Modi says women are the biggest silent voters for BJP

దేశంలో బీజేపీ జోరు ఏమాత్రం తగ్గలేదని నిన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పలు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశం నలుమూలలకూ బీజేపీ వ్యాపించిందన్న విషయం ఈ ఫలితాలతో అర్థమవుతోందని మోదీ అన్నారు. దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందునే ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు.

బీహార్ లో గత ఎన్నికలు హింసాత్మక ఘటనల నడుమ జరిగేవని, కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగిందని చెప్పారు. ఓవైపు కరోనా ఉన్నా సరే ప్రజలు భారీగా తరలివచ్చి ఎన్డీయే కూటమిని గెలిపించారని వెల్లడించారు. ఇక ఓటింగ్ సరళి గురించి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో సైలెంట్ ఓటర్ల మాట ఎక్కువగా వింటున్నామని, బీజేపీ వరకు సైలెంట్ ఓటర్లంటే మహిళలే అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి మహిళలే అతిపెద్ద సైలెంట్ ఓటర్లుగా మారారని తెలిపారు. దేశంలో మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడడంలో బీజేపీ కృషి ఉందని అన్నారు. బీజేపీ దేశ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుందని, ప్రజాసేవ ఎలాగో తమకు తెలుసని పేర్కొన్నారు.

More Telugu News