AP High Court: వివేకా హత్య కేసులో అన్ని రికార్డులు సీబీఐకి అందజేయాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను ఆదేశించిన హైకోర్టు

  • వివేకా హత్యకేసులో కీలక పరిణామం
  • రికార్డులు అప్పగించేందుకు నిరాకరించిన పులివెందుల కోర్టు
  • హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ వర్గాలు
  • సీబీఐకి అనుకూలంగా హైకోర్టు తీర్పు
AP High Court orders Pulivendula court to submit all records to CBI

వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అంశంపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకేసు రికార్డులను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ తన పిటిషన్ లో హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం సీబీఐకి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలంటూ పులివెందుల మేజిస్ట్రేట్ ను హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో రికార్డులు అప్పగించేందుకు పులివెందుల కోర్టు నిరాకరించిన నేపథ్యంలోనే సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నవంబరు 2న పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించగా, సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించారు. కేసును రీ రిజిస్ట్రేషన్ చేసిన సీబీఐ తనదైనశైలిలో దర్యాప్తు షురూ చేసింది. సీబీఐ నుంచి ఓ బృందం ఇప్పటికే ఓసారి కడప వచ్చి కేసు పూర్వాపరాలు పరిశీలించింది. వివేకా ఇంటిని, పరిసరాలను నిశితంగా శోధించింది.

More Telugu News