RGV: అమృతప్రణయ గాథ 'మర్డర్‌' సినిమా విడుదలకు కోర్టు అనుమతి.. రామ్ గోపాల్ వర్మ హర్షం

  • కొన్ని రోజుల క్రితం సినిమా విడుదలపై కోర్టు స్టే
  • తాజాగా ఈ స్టేను ఎత్తివేసిన న్యాయస్థానం 
  • మారుతీరావు, అమృత, ప్రణయ్‌ ఫొటోలు వాడొద్దని ఆదేశాలు
murder movie to be released

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా  'మారుతి రాసిన అమృతప్రణయ గాథ' అంటూ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ సినిమా తీసిన విషయం తెలిసిందే. అయితే, ప్రణయ్‌ భార్య అమృత ఈ సినిమాను నిలిపివేయాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కోర్టులో పిటిషన్‌ వేయడం జరిగింది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి, ఇలాంటి సమయంలో కల్పిత కథతో ఉన్న ఈ సినిమా విడుదలైతే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది.

దీంతో నల్లగొండ కోర్టు అప్పట్లో ఈ సినిమా విడుదలపై స్టే విధించింది.  దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణకు అత్యవసర నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను కూడా జరిపింది. అయితే, ఈ రోజు కోర్టు ఈ స్టేను ఎత్తివేసింది.

మారుతీరావు, అమృత, ప్రణయ్‌ ఫొటోలు వాడకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆర్జీవీ ట్విట్టర్‌ ద్వారా హర్షం వ్యక్తం చేస్తూ కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు. కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.

More Telugu News