Jr NTR: తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్.... అందరికీ థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్

  • వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడిన హైదరాబాద్
  • భారీగా ప్రాణనష్టం
  • స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
  • హైదరాబాద్ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపు
Jr NTR donates fifty lakh rupees for Hyderabad flood affected people

హైదరాబాదులో సంభవించిన భారీ వర్షాలు, వరదలకు ఎన్నో కుటుంబాలు ప్రభావితమయ్యాయని టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన హైదరాబాదు నగర పునరుద్ధరణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. ఈ ఆపద సమయంలో అందరం రంగంలోకి దిగి హైదరాబాదు నగర పునర్నిర్మాణంలో పాలుపంచుకుందామని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.

అటు, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హైదరాబాద్ నగర వాసుల కష్టాలకు స్పందించారు. సహాయ చర్యల కోసం రూ.5 లక్షలు విరాళంగా అందిస్తున్నట్టు ట్విట్టర్ లో వెల్లడించారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు వంటి నటులు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షాలతో, చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లడంతో హైదరాబాద్ వరద ముంపు గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో నగర ప్రజలకోసం విరాళాలు ప్రకటిస్తున్న వారందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, నాగార్జున తదితరులకు మంత్రి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. 

More Telugu News