Ragini Dwivedi: జైలులో జారిపడి గాయపడిన నటి రాగిణి ద్వివేది.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోరుతూ పిటిషన్

  • నడుము, వెన్నెముకకు తీవ్ర గాయం
  • జైలులోని చికిత్సతో ఉపశమనం లభించలేదన్న నటి
  • స్వాధీనం చేసుకున్న ట్యాబ్లెట్, పెన్‌డ్రైవ్‌లను తిరిగి అప్పగించాలంటూ మరో పిటిషన్
Ragini Dwivedi files plea for treatment at private hospital

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రాగిణి ద్వివేది ప్రస్తుతం పరప్పణ అగ్రహారలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ నెల 23 వరకు ఆమె కస్టడీ కొనసాగనుండగా తాజాగా, ఆమె కోర్టును ఆశ్రయించారు. జైలులో ప్రమాదవశాత్తు జారిపడిన తాను తీవ్రంగా గాయపడ్డానని నడుము, వెన్నెముకకు దెబ్బలు తగిలాయని పేర్కొన్నారు.

జైలులో తనకు వైద్య చికిత్స లభిస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితం ఉండడం లేదని, కాబట్టి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సీసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, ఆమె తన కుటుంబ సభ్యులు, న్యాయవాదిని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. రాగిణి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ట్యాబ్లెట్, పెన్ డ్రైవ్‌లను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులను ఆదేశించాలంటూ మరో పిటిషన్‌ను కూడా న్యాయవాది దాఖలు చేశారు.

More Telugu News