Harish Rao: రేపు దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఇదే ఫలితం వస్తుంది: హరీశ్ రావు

  • నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు
  • టీఆర్ఎస్ విజయం అద్భుతమన్న హరీశ్ రావు
  • ఎలాంటి ఎన్నికలొచ్చినా ప్రజలు టీఆర్ఎస్ వెంటేనని వ్యాఖ్యలు
Harish Rao confidant in TRS Win Dubbaka By Elections

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం సాధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్పందించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం అద్భుతమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల ఓట్లు కలిపినా డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేశారు. తదుపరి జరిగే దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లోనూ ఇదే ఫలితం వస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని స్పష్టం చేశారు. మొన్న హుజూర్ నగర్ లోనూ, ఇవాళ నిజామాబాద్ లోనూ, రేపు దుబ్బాక, ఆపై గ్రేటర్ హైదరాబాద్... ఎలాంటి ఎన్నికలొచ్చినా ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. తమ విజయాలే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బాలాజీ గార్డెన్ లో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News