Mahesh Babu: త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా.. ప్రకటించిన మహేశ్!

  • మహేశ్, త్రివిక్రమ్ కలయికలో 'ఖలేజా' 
  • అది వచ్చి పదేళ్లయిందన్న మహేశ్ బాబు 
  • 'ఖలేజా' తనకు ప్రత్యేకమన్న మహేశ్  
Mahesh Babu announcing a film with Trivikram soon

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో త్వరలో ఓ చిత్రం చేయబోతున్నట్టుగా హీరో మహేశ్ బాబు ఈ రోజు ప్రకటించాడు. పదేళ్ల క్రితం వీరిద్దరి కలయికలో 'ఖలేజా' సినిమా వచ్చింది. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం సక్సెస్ కాలేదు. దాంతో వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. అయితే, వీరి కలయికలో మరో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఇటీవల వార్తలొస్తున్నాయి.

ఇక ఈ రోజుతో 'ఖలేజా' వచ్చి పదేళ్లయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మహేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఖలేజా వచ్చి పదేళ్లయింది. అందులో నాకు నేను ఆర్టిస్టుగా కొత్తగా కనిపించాను. ఆ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. నా మంచి మిత్రుడు, బ్రిలియంట్ అయిన త్రివిక్రమ్ కి ఎన్నో కృతజ్ఞతలు. మా తదుపరి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాను.. అది త్వరలోనే.." అంటూ మహేశ్ పోస్ట్ పెట్టాడు. దీనిని బట్టి వీరిద్దరి కలయికలో త్వరలో ఓ సినిమా రానుందని మనం అర్థం చేసుకోవచ్చు.

కాగా, మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అమెరికాలో ప్రారంభం అవుతుంది. మరోపక్క, త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఇది కూడా త్వరలోనే మొదలవుతుంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ కి వెళ్లచ్చన్న మాట!        

More Telugu News