Rhea Chakraborty: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు!

  • అరెస్టయిన నెల రోజుల తరువాత బెయిల్
  • డిప్రెషన్ లోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న రియా
  • తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదని వాదన 
  • షోవిక్ కు మాత్రం బెయిల్ ఇవ్వని కోర్టు
Rhea Chakraborthy Gets Bail

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి జైలు గోడల నుంచి ప్రస్తుతానికి విముక్తి లభించింది. ఆమెకు కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో సెప్టెంబర్ 8న అరెస్ట్ అయిన రియా, దాదాపు నెల రోజుల తరువాత బయటకు రానుంది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 20 వరకూ పొడిగిస్తూ, స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజునే హైకోర్టు బెయిల్ ను మంజూరు చేయడం గమనార్హం.

తన బెయిల్ పిటిషన్ లో, సుశాంత్ సింగ్, తనకు అలవాటైన డ్రగ్స్ కోసం సన్నిహితులను సంప్రదించేవాడని, ఆ కారణంతోనే తాను, తన సోదరుడు నార్కోటిక్స్ అధికారులకు టార్గెట్ గా మారామని వాపోయారు. సుశాంత్ కు బైపోలార్ డిజార్డర్ ఉందని, అతన్ని కుటుంబీకులు దూరం పెట్టారని, ఆ డిప్రెషన్ లోనే, మానసిక అనిశ్చితికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని, తనకేమీ సంబంధం లేదని ఆమె వాదించింది.

తనపై నార్కోటిక్స్ అధికారులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు తెలుపుతూ, తనకు బెయిల్ ను మంజూరు చేయాలని కోరుకున్నారు. ఆమె వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న రియా సోదరుడు షోవిక్ కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.

More Telugu News