Andhra Pradesh: పొరుగు రాష్ట్రాల నుంచి మూడు మద్యం సీసాలను కూడా తేనీకుండా ఏపీలో చట్ట సవరణ!

  • పొరుగు రాష్ట్రాల నుంచి మూడు సీసాలు తెచ్చుకునే వెసలుబాటు
  • ఇటీవలి కాలంలో పెరిగిన మద్యం తెస్తున్న వారి సంఖ్య
  • అదనపు పన్నులను విధించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన
AP Wants To Change Liquor Police

ఇతర రాష్ట్రాల నుంచి ప్రస్తుతం అనుమతిస్తున్నట్టుగా మూడు మద్యం సీసాలను కూడా అనుమతించకుండా చట్ట సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో ప్రతి వ్యక్తి వద్దా మూడు సీసాల వరకూ నిల్వ ఉంచుకునేందుకు అనుమతులు అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆపై తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో అత్యధికులు మూడేసి సీసాల చొప్పున మద్యం తెచ్చుకుంటున్నారు. వీరిపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో, కేసులు పెట్టగా, ప్రభుత్వమే గరిష్ఠంగా మూడు మద్యం సీసాలను ఉంచుకోవచ్చని స్పష్టం చేసిన వేళ, అది ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా నేరం కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఓ కేసును విచారించిన ధర్మాసనం, ఎక్కడ కొనుగోలు చేసైనా పౌరులు మూడు సీసాలను తెచ్చుకోవచ్చని తేల్చింది.

ఈ తీర్పు తరువాత, ఇతర రాష్ట్రాల నుంచి స్వల్ప మొత్తంలో మద్యం తీసుకుని ఏపీకి వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం కొని, ఇళ్లల్లో నిల్వ ఉంచుకుని, వ్యాపారం సాగిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీంతో మూడు సీసాల నిబంధనను మారుస్తూ చట్ట సవరణ చేయాలని, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్నులను వేసి, ధరలను సమానం చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై జగన్ సర్కారు అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News