Chennai super kings: వరుస ఓటములపై ధోనీ స్పందన.. రాయుడు లేకేనన్న సారథి!

  • రాయుడు వస్తే అంతా సర్దుకుంటుంది
  • జట్టులో సమతూకం దెబ్బతినడం కొంపముంచుతోంది
  • తర్వాతి మ్యాచ్‌లో రాయుడు అందుబాటులోకి వస్తాడు
MS Dhoni responds about two consecutive defeats

ఐపీఎల్‌లో వరుస ఓటములపై చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ స్పందించాడు. తొలి మ్యాచ్‌లో ఇరగదీసిన అంబటి రాయుడు జట్టులో లేకపోవడం వల్లే ఓటమి పాలవుతున్నట్టు చెప్పాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత ధోనీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

రాయుడు లేకపోవడంతో జట్టులో సమతూకం దెబ్బతిందని, ఈ కారణంగానే చివరి రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యామన్నాడు. బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం బాధగా ఉందన్నాడు. ఆరంభంలో జోరు తగ్గడంతో బంతులు, పరుగుల మధ్య వ్యత్యాసం పెరిగి ఒత్తిడి పెరుగుతోందన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు అందుబాటులోకి వస్తాడని, దీంతో జట్టు సమతూకంలోకి వచ్చి పరిస్థితి మెరుగుపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు.

రాయుడు కనుక అందుబాటులోకి వస్తే అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకు వీలుంటుందని ధోనీ చెప్పుకొచ్చాడు. కాగా, ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రాయుడు గాయం కారణంగా ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

More Telugu News