drugs case: సంజనకు ఇంటి ఆహారం నిరాకరణ.. దోమలు కుడుతున్నాయంటూ జైలు అధికారులతో నటి వాగ్వివాదం!

  • ఒకే గదిలో సంజన, రాగిణి
  • ఆహారం, దుస్తులు తీసుకెళ్లిన సంజన తల్లిదండ్రులు
  • బయటకు రాకుండా గదిలోనే 
parappana jail authorities rejected home food to actress sanjana

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న నటి సంజన గల్రానీకి ఇంటి ఆహారాన్ని అందించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. మరో నటి రాగిణి ద్వివేదితో కలిసి ఒకే బ్యారక్‌లో ఉంటున్న సంజనను కలిసి ఆహారం, దుస్తులు అందించేందుకు ఆమె తల్లిదండ్రులు మనోహర్, రేష్మా గల్రానీలు నిన్న జైలు వద్దకు వెళ్లారు. వారి నుంచి దుస్తులను మాత్రమే తీసుకున్న అధికారులు వెంట తెచ్చిన ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను తీసుకునేందుకు నిరాకరించి తిరిగి వారికే ఇచ్చేశారు.

మరోవైపు, నటి రాగిణి గత నాలుగు రోజులుగా జైలులో ఒంటరిగా ఉండగా, సంజన వచ్చిన తర్వాత ఆమెను కూడా అదే బ్యారక్‌లో ఉంచారు. వెంట తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ ఇద్దరూ కాలక్షేపం చేస్తున్నారు. బ్యారక్ బయట తిరిగే అవకాశం ఉన్నప్పటికీ వారిద్దరూ గదిని విడిచి బయటకు రావడం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు, రాగిణి, సంజన ఇద్దరికీ జైలు అధికారులు ఇతర ఖైదీలకు అందించే సాధారణ ఆహారాన్నే ఇచ్చారు.

సంజనను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. జైలు నిబంధనల ప్రకారం రాగిణి, సంజనలను కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడుకునేందుకు జైలు అధికారులు అనుమతించడంతో వారు కొంత సమయం కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నారు. కాగా, తన బ్యారక్‌లో దోమలు విపరీతంగా ఉన్నాయని, వాటి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదంటూ సంజన జైలు అధికారులతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది.

More Telugu News