Gopichand: ఆగిపోయిన గోపీచంద్ సినిమా.. అడ్వాన్సు వెనక్కి ఇచ్చేసిన హీరో!

  • ప్రస్తుతం సంపత్ నందితో 'సీటీమార్' సినిమా 
  • బీవీఎస్ఎన్ ప్రసాద్ కు సినిమా ఒప్పుకున్న గోపీచంద్  
  • ఆమధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న సినిమా
  • ఆగిపోవడంతో రెండు కోట్లు వెనక్కి ఇచ్చేసిన గోపీచంద్
Gopichand starrer new film has been shelved

ఒక సినిమా మొదలైనంత మాత్రాన ఇక అది పూర్తయిపోతుందనుకోవడానికి వీల్లేదు. ఒక్కోసారి ప్రారంభం జరిగాక ఆ సినిమా ముందుకి వెళ్లదు.. ఒక్కోసారి మధ్యలో కూడా ఆగిపోతుంటుంది.. కొన్నిసార్లు మొత్తం పూర్తయ్యాక రిలీజ్ కాకుండా ఆగిపోయే సినిమాలు కూడా వుంటాయి. ఇలా జరగడానికి సవాలక్ష కారణాలు వుంటాయి. ఇలాగే తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ సినిమా కూడా ఒకటి ఆగిపోయినట్టు తెలుస్తోంది. దాంతో తాను తీసుకున్న అడ్వాన్సు మొత్తాన్ని ఆ చిత్ర నిర్మాతకు సదరు హీరో తిరిగి ఇచ్చేసినట్టు కూడా చెబుతున్నారు.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' చిత్రాన్ని చేస్తున్న గోపీచంద్.. ఇటీవల ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడు. దీనికి తమిళ దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా నిర్మించనున్నట్టు వార్తలొచ్చాయి. ఆమధ్య ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

అయితే, ఇంతలోనే ఈ చిత్రం ఆగిపోయినట్టు, నిర్మాత నుంచి అడ్వాన్సుగా తాను తీసుకున్న రెండు కోట్లను గోపీచంద్ తిరిగి ఇచ్చేసినట్టు టాలీవుడ్ లో తాజాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ చిత్రం ఎందుకు ఆగిపోయిందన్న విషయం మాత్రం ఇంకా వెల్లడికాలేదు.    

More Telugu News