Sikki Reddy: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి రెండోసారి కరోనా టెస్టులో నెగెటివ్

  • మంగళవారం తొలి విడత టెస్టులో సిక్కిరెడ్డికి పాజిటివ్
  • స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో మరోసారి పరీక్షలు
  • సిక్కిరెడ్డికి కరోనా లేదని వెల్లడి
Badminton player Sikki Reddy gets relief as her second corona test came negative

హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి మంగళవారం నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన రెండో టెస్టులో ఆమెకు నెగెటివ్ వచ్చింది. దీంతో ఈ యువ క్రీడాకారిణికి ఊరట లభించినట్టయింది. నిన్న వెల్లడైన ఫలితాల్లో సిక్కి రెడ్డితో పాటు అకాడమీ ఫిజియో కిరణ్ కు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో శానిటైజేషన్ చేయడానికి పుల్లెల గోపీచంద్ అకాడమీని మూసివేశారు.

లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో కొన్నినెలలుగా మూతపడిన అకాడమీ, ఇటీవలే తెరుచుకుంది. అయితే భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఆదేశాల మేరకు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు, సహాయక సిబ్బంది, కోచ్ లు అందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. తొలుత నిర్వహించిన ఈ టెస్టుల్లో సిక్కి రెడ్డికి, కిరణ్ కు తప్ప మిగతా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇప్పుడు స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించిన రెండో పరీక్షలో సిక్కి రెడ్డికి కరోనా లేదని తేలడంతో అకాడమీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

More Telugu News