SA Bobde: బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా నవ్వులు పూయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

  • 1994లో బీజేపీ నేత హత్య
  • ధరేంద్ర వాల్వీ అనే కాంగ్రెస్ నేతకు జీవితఖైదు
  • సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వాల్వీ
Supreme Court CJI asks Jail or bail in a bail plea hearing

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ఓ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తనలోని హాస్య చతురతను ప్రదర్శించారు. 1994లో ఓ బీజేపీ నేత హత్య కేసులో కాంగ్రెస్ నేత ధర్మేంద్ర వాల్వీ, మరో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు జీవితఖైదు పడింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును 2017లో బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో, వాల్వీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో నిన్న విచారణ జరిగింది. మంగళవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్ఏ బోబ్డే సందర్భోచితంగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.

"నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణ భగవానుడు పుట్టింది జైల్లోనే. ఆయన పుట్టినరోజున బెయిల్ పిటిషన్ విచారిస్తున్నాం కాబట్టి జైలు కావాలా, లేక బెయిలు కావాలా?" అంటూ చమత్కరించారు. దాంతో ధర్మేంద్ర వాల్వీ తరఫు న్యాయవాది బెయిలే కావాలని అన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఎస్ఏ బోబ్డే సరదాగా స్పందించారు. "మంచిది... మీకు పెద్దగా మతం పట్టింపులేవీ లేవనుకుంటా" అంటూ బెయిల్ ఇస్తున్నట్టు తీర్పు ఇచ్చారు.

More Telugu News