Ayodhya Ram Mandir: దేదీప్యమానంగా వెలుగులను విరజిమ్ముతున్న అయోధ్యాపురి!

  • నేడు అత్యంత కీలక ఘట్టం
  • దీప కాంతులతో ముస్తాబైన అయోధ్య
  • టపాసులు కాల్చిన యోగి ఆదిత్యనాథ్
Dewali in Ayodhya

అయోధ్యలో భవ్య రామాలయం ఏర్పాటుకు అత్యంత కీలక ఘట్టమైన శంకుస్థాపనకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో గత రాత్రి అయోధ్యలో దీపోత్సవం ఘనంగా జరిగింది. భూమి పూజ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి ఉత్సవాలు జరుపుకోవాలని ఆలయ ట్రస్ట్‌ పిలుపునివ్వగా, అయోధ్య యావత్తూ దీప కాంతులతో దేదీప్యమానంగా ముస్తాబైంది.

సరయూ నదీతీరాన్ని మట్టి ప్రమిదలతో అలంకరించారు. దివ్వెల వెలుగులో రామ జన్మభూమి వెలిగిపోయింది. నదీ తీరంతో పాటు పట్టణంలోని ఇతర ఆలయాలు సహా, ప్రతి ఒక్కరి ఇంటి ముందూ దీపాలను వెలిగించారు. లక్నోలోని తన నివాసం ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలను వెలిగించి వేడుకల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఇది పర్వదినమని వ్యాఖ్యానించిన ఆయన, టపాసులు కాల్చి తన ఆనందాన్ని పంచుకున్నారు.




More Telugu News