Vikas Dubey: తన స్థాన బలాన్ని చూసుకుని రెచ్చిపోయిన దూబే... ఎన్ కౌంటర్ స్థలంలో జరిగింది ఇదే!

  • ఈ తెల్లవారుజామున ఎన్ కౌంటర్
  • కాన్పూర్ శివార్లలోకి రాగానే డ్రైవర్ పై దాడి
  • ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో హతం
Vikas Dubey Encounter Story

దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వుండగా, 690 కిలోమీటర్ల దూరం సజావుగానే సాగింది. ఆపై కాన్పూర్ శివార్లలోకి వాహనం ప్రవేశించగానే అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. అవే గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ కు కారణమయ్యాయి. ఘటనా స్థలిలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఓ పోలీసు అధికారి స్వయంగా వెల్లడించారు. నిన్న సాయంత్రం ఉజ్జయిని నుంచి వికాస్ దూబేను తీసుకుని యూపీలోని కాన్పూర్ కు పోలీసులు బయలుదేరారు.

మార్గమధ్యంలో ఓ మారు కొంతసేపు ఆగారు కూడా. వికాస్ దూబేను కాన్పూర్ కు తీసుకుని వస్తున్నారని అతని అనుచరులకు తెలిసిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన సదరు అధికారి, కాన్పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలోకి తమ కాన్వాయ్ రాగానే, కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడించాయని అన్నారు. అపై కాన్పూర్ శివార్లలోకి వాహనం రాగానే, డ్రైవర్ వెనుక ఉన్న వికాస్ దూబే, తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ నుంచి పిస్టల్ ను లాక్కున్నాడు. డ్రైవర్ తో పెనుగులాడగా, వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఆ వెంటనే వాహనాన్ని దిగిన దూబే, పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడు.

ఈ విషయాన్ని స్పష్టం చేసిన కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్, జరిగిన ఘటనలో వికాస్ దూబే హతుడయ్యాడని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు తదుపరి దశలో వెల్లడిస్తామని అన్నారు. కాన్పూర్ లో భారీ వర్షం కురుస్తోందని, ఆ కారణంగా పరిస్థితులను తనకు అనువుగా మార్చుకుని తప్పించుకోవాలని దూబే చూశాడని, కానిస్టేబుల్ నుంచి పిస్టల్ ను లాక్కుని పారిపోతుంటే, పోలీసులే అతన్ని కాల్చారని తెలిపారు.

More Telugu News