Nirav Modi: నీరవ్ మోదీకి చెందిన రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ

  • పీఎన్బీని వేల కోట్లకు ముంచేసి పరారైన నీరవ్, మెహుల్ 
  • ముంబై, లండన్, యూఏఈలోని ఆస్తులు స్వాధీనం
  • ఇప్పటికే రూ.2,348 కోట్ల విలువైన ఆస్తుల జప్తు
PNB scam accused Nirav Modi assets have been seized by ED

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన దాదాపు రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. నకిలీ గ్యారెంటీలు చూపి పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర ముంచేసిన నీరవ్ మోదీ, ఆయన బంధువు అయిన మెహుల్ చోక్సీలు 2018లో విదేశాలకు పారిపోయి తలదాచుకున్నారు.

ఇక లండన్‌లో ఉన్న నీరవ్ మోదీని గతేడాది అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తుల ఒప్పందం కింద అతడిని దేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరో నిందితుడు మెహుల్ చోక్సీ అంటిగ్వాలో ఉంటూ అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నాడు.

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది. నీరవ్‌కు చెందిన రూ.2,348 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకోగా, తాజాగా, ముంబైలోని వర్లి ప్రాంతంలో ఉన్న సముద్ర మహల్, బీచ్ ఒడ్డున ఉన్న విలాసవంతమైన ఫాం హౌస్, రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని విండ్‌మిల్,  లండన్‌, యూఏఈలోని ఫ్లాట్లను జప్తు చేసింది. వీటి విలువ రూ.330 కోట్లని ఈడీ తెలిపింది.

More Telugu News