JC Diwakar Reddy: అసెంబ్లీలో రేపు ఏం జరుగుతుందో జోస్యం చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి!

  • అసెంబ్లీలో రేపు ఏమీ జరగదు
  • అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు పంపి బిల్లులు పాస్ చేసుకుంటారు
  • నన్ను కూడా ఏదో ఒక కేసు పెట్టి లోపల వేసేస్తారు
Nothing will happen in tomorrows assembly session says JC Dewakar Reddy

టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ ముగ్గురూ వివిధ కేసుల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో రేపు ఏం జరుగుతుందో జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.

అసెంబ్లీలో రేపు ఏమీ జరగదని, అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు పంపి... ప్రభుత్వానికి అవసరమైన బిల్లులు పాస్ చేసుకుంటారని చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. కేసులు ఉన్నా, లేకపోయినా ఇబ్బంది పెట్టాలనేదే వైసీపీ యోచన అని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల పేర్లు ఎఫ్ఐఆర్ లో లేవని... అయినా అరెస్ట్ చేశారని అన్నారు. తనపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి కేసు లేదని... అయినప్పటికీ, ఏదో ఒక కేసు పెట్టి తనను కూడా లోపల పడేస్తారని వ్యాఖ్యానించారు.

వాహనాలను అమ్మిన వారిని, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను వదిలేసి... తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారని దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ పిటిషన్ వేస్తున్నామని, బెయిల్ వస్తుందని చెప్పారు. తమ కుటుంబంపై ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పేందుకే నారా లోకేశ్ తమ ఇంటికి వచ్చారని అన్నారు.

More Telugu News