IYR Krishna Rao: ఇదే నిజమైతే ఇంతకన్నా అవివేకమైన నిర్ణయం మరొకటి ఉండదు: ఐవైఆర్ కృష్ణారావు

  • విశాఖలో ఎంపిక చేసిన లులూ స్థలాన్ని అమ్మకానికి పెట్టారట 
  • ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చాలా అనుకూలమైన స్థలం
  • వాణిజ్యపరమైన అవసరాలకు అమ్మేయాలనుకోవటం అవివేకం
  • వ్యక్తిగత ప్రచారం కోసమే సర్కారు సిద్ధమవుతున్నట్లుంది
iyr krishnarao criticises ycp

విశాఖలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం గత టీడీపీ సర్కారు కేటాయించిన ఏపీఐఐసీ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ వచ్చిన ఓ వార్తపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు స్పందించారు. 'ఇదే నిజమైతే ఇంతకన్నా అవివేకమైన నిర్ణయం మరొకటి ఉండదు. విశాఖలో ఎంపిక చేసిన ఈ స్థలం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చాలా అనుకూలమైన స్థలం. పారదర్శక విధానాన్ని అనుసరించకుండా లులూ సంస్థకు ఈ స్థలాన్ని కేటాయించారని గత ప్రభుత్వం మీద ఆరోపణ ఉంది' అని చెప్పారు.

అయితే, 'ప్రపంచ స్థాయిలో సదస్సుల నిర్వహణకు విశాఖ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అటువంటి కన్వెన్షన్ సెంటర్ ముఖ్య పాత్ర పోషించి ఉండేది. దానిని విస్మరించి వేలం ద్వారా ఈ భూమిని వాణిజ్యపరమైన అవసరాలకు అమ్మేయాలని అనుకోవటం అవివేకం' అని అన్నారు.

'ప్రభుత్వ భూములను రాష్ట్ర అభివృద్ధికి పనికివచ్చే ప్రాజెక్టులకు వినియోగించకుండా  వేలం వేసి పప్పుబెల్లాలు పంచటానికి వినియోగించటం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని తమ వ్యక్తిగత ప్రచారం కోసం తాకట్టు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు ఉంది' అని విమర్శించారు. 

More Telugu News