Kadapa District: విగ్గుతో వలవేస్తాడు.. యువతుల ఫొటోలు మార్చి అందినంతా దోచేస్తాడు!

  • కడప జిల్లాలో ఘటన
  • తన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలి కిడ్నాప్
  • విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడి
Kadapa police arrested man who cheat women

ఫేస్‌బుక్‌లో యువతులకు వలవేసి ఆపై ఫొటోలను మార్ఫింగ్ చేసి డబ్బు, బంగారం దోచుకుంటున్న వ్యక్తిని కడప జిల్లా పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా పడిగ్యాలకు చెందిన రాజ్‌కుమార్ గత కొంతకాలంగా రాజుపాళెంలో ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు.

 తాను నిర్వహిస్తున్న పాఠశాలలోని ఉపాధ్యాయురాలిని కారులో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు తీసుకెళ్లిన రాజ్‌కుమార్ ఓ ఇంటిలో నిర్బంధించి హింసించాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, రాజ్‌కుమార్ చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా అతడు చేసిన పలు మోసాలు వెలుగులోకి వచ్చాయి. విగ్గుపెట్టుకుని అందంగా తయారైన ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటాడు. ఆపై తన ప్లాన్ అమలు చేస్తాడు. యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి చూపించి, వారిని బెదిరించి బంగారం, డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడిపై 12 రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. 

More Telugu News