Harish Shankar: మలయాళ రీమేక్ కి హరీశ్ దర్శకత్వం?

  • తెలుగులో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్
  • బిజూ మీనన్ పాత్రలో రవితేజ
  • హరీశ్ చేయాల్సిన పవన్ సినిమా లేట్
  • ఈలోగా దీనిని పూర్తిచేసే పనిలో హరీశ్
Harish Shankar to direct Malayalam remake

గత కొన్ని రోజుల నుంచీ టాలీవుడ్ లో వార్తల్లో వున్న సినిమా 'అయ్యప్పనుమ్ కోషియం'! మలయాళంలో వచ్చిన ఈ వినూత్న కథా చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో, మలయాళంలో ప్రధాన పాత్ర పోషించిన బిజూ మీనన్ పాత్రలో బాలకృష్ణ చేత నటింపజేయాలని నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ ఆయన దీనిని తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆ పాత్రకు రవితేజను తీసుకోవాలని భావించిన నిర్మాతలు ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలావుంచితే, ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పటివరకు వెల్లడికాలేదు. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దీనికి పనిచేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. వాస్తవానికి పవన్ కల్యాణ్ తో హరీశ్ తన తదుపరి చిత్రాన్ని చేయాల్సి వుంది. అయితే, లాక్ డౌన్ కారణంగా పవన్ చేయాల్సిన ఇతర ప్రాజక్టులు ఆలస్యం కావడంతో, హరీశ్ తో చేయాల్సిన చిత్రం కూడా ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఈలోగా తాజాగా వచ్చిన ఈ రీమేక్ ను హరీశ్ పూర్తి చేయొచ్చని సమాచారం.

More Telugu News