MS Dhoni: పంత్ కాదు... ధోనీకి కొత్త వారసుడు ఇతడేనంటున్న ఉతప్ప!

  • అవకాశాలు సద్వినియోగపర్చుకోని పంత్
  • రియాన్ పరాగ్ పేరు ప్రస్తావించిన ఉతప్ప
  • గత ఐపీఎల్ లో రాణించిన పరాగ్
New name comes surface as Dhoni successor

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ ఓ అరుదైన ఆటగాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీ ఇలా అనేక బాధ్యతలను ఎంతో ప్రశాంతంగా నిర్వర్తించే అద్భుత క్రికెటర్ గా గుర్తింపు అందుకున్నాడు. అయితే ధోనీ కెరీర్ చరమాంకంలో ఉందన్నది వాస్తవం. ఎప్పట్నించో ధోనీ వారసులు అంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చినా, ఢిల్లీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు మరింత ఎక్కువగా వినిపించింది. కానీ తనకు వచ్చిన అవకాశాలను పంత్ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఈ నేపథ్యంలో, ధోనీకి సిసలైన వారసుడిగా మరో కొత్త పేరు తెరపైకి తెచ్చింది. కర్ణాటక క్రికెటర్ రాబిన్ ఉతప్ప దీనిపై మాట్లాడుతూ, రియాన్ పరాగ్ పేరును ప్రస్తావించాడు. టీమిండియాలో ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా రియాన్ పరాగ్ కు ఉందని తెలిపాడు. ధోనీ తర్వాత పరాగేనని, అతడ్ని భారత జట్టులో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఊతప్ప పేర్కొన్నాడు. పరాగ్ సామర్థ్యం దృష్ట్యా ఎక్కువ కాలం టీమిండియాకు సేవలు అందిస్తాడని వివరించాడు.

కాగా, రియాన్ పరాగ్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటపై పరాగ్ కు మంచి పట్టు ఉందని అన్నాడు. భవిష్యత్ లో మరింతగా ఎదుగుతాడని తెలిపాడు. అసోం రాష్ట్రానికి చెందిన పరాగ్ వయసు 18 ఏళ్లే. అసోం రంజీ జట్టు తరఫున దేశవాళీ పోటీలాడుతూ, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికయ్యాడు. గత ఐపీఎల్ సీజన్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

More Telugu News