Lockdown: లాక్ డౌన్ లో ప్రియుడిని ఇంటికి పిలిచిన యువతి... కొట్టి చంపిన తండ్రి, అన్న!

  • తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో ఘటన
  • ఇంట్లో కుమార్తెతో యువకుడిని చూసి బంధువులను పిలిపించిన తల్లి
  • క్రికెట్ బ్యాట్ తో దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి
Girl Family Murdered Lover who is with her

తన ప్రియురాలి కోరిక మేరకు ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు, దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడికి దగ్గర్లోని చిన్న పాళయంకు చెందిన గౌతమ్ అనే యువకుడు, సూరస్వర పట్టి గ్రామానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు. గడచిన నెలన్నర రోజులుగా లాక్ డౌన్ నిబంధనలతో ఇంటికే పరిమితమైన గౌతమ్, ప్రియురాలిని చూడాలని తపించాడు.

ప్రియుడి బాధను తట్టుకోలేకపోయిన ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి, అతనికి వర్తమానం పంపింది. ఆ వెంటనే అతను ఆమె ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరూ గదిలో ఉండగా, అమ్మాయి తల్లి ఇంటికి వచ్చి, లోపలి నుంచి మాటలు వినిపించడంతో, వెంటనే భర్త, కుమారుడు, తమ్ముడిని పిలిపించింది. వారు ముగ్గురూ వచ్చి గౌతమ్ తలపై క్రికెట్ బ్యాటుతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతను చనిపోతాడన్న భయంతో పోలీసులను పిలిపించారు.

అతను తమ ఇంట్లోకి ఎవరూ లేని సమయాన్ని చూసి జొరబడ్డాడని, ఆత్మరక్షణ కోసం దాడి చేశామని కల్పిత కథను సృష్టించారు. గాయాలపాలైన గౌతమ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తరువాత, పోలీసులు తమ విచారణలో భాగంగా బాలికను గట్టిగా నిలదీయగా, అసలు విషయం చెప్పింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక తండ్రి, సోదరుడు, మేనమామను అరెస్ట్ చేశారు.

More Telugu News